19/07/2017
కొండపైకి నేరగాళ్లకు నో ఎంట్రీ!
పాత నేరస్తులకు కిందే చెక్
అలిపిరిలో ప్రత్యేక కెమేరాల ఏర్పాటు
నేరగాళ్లను ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు
తిరుమల, జూలై 18: ఏడు కొండలపై కాలు పెట్టాలంటే... ఇక కెమేరాలో బొమ్మ పడాల్సిందే. అలిపిరి దగ్గరో.... మెట్టు మార్గం ముందో... కొండపైకి వేసే తొలి అడుగుకు ముందే మిమ్మల్ని ప్రత్యేక కెమేరాలు అపాదమస్తకం క్షుణ్నంగా తనిఖీ చేస్తాయి. సాధారణ భక్తుల్లో కలిసిపోయి గుట్టుగా కొండెక్కేద్దామనుకునే పాత నేరగాళ్ల గుట్టును ఇట్టే పట్టేస్తాయి. తక్షణం పోలీసులను అప్రమత్తం చేస్తాయి. వెరసి నేరగాళ్లకు ఏడు కొండల తొలిమెట్టు దగ్గరే చెక్. ఇక వెంకన్న కొండంతా జీరో క్రైమ్ జోన్. టీటీడీ అధికారుల లక్ష్యం ఇది. ఫేస్ రికగ్నేషన్ కెమేరాల ఏర్పాటు ద్వారా నేరగాళ్లను కొండ ఎక్కనీయకుండా చేయాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి క్షేత్రానికి ముఖద్వారమైన అలిపిరిలోనే పాతనేరస్థుల జాడ కనిపెట్టేసి మళ్లీ కటకటాల వెనక్కి పంపేలా ఓ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఫేస్ రికగ్నిషన్ కెమేరాలను ఏర్పాటు చేయాలని తలపోస్తోంది.
ఇలా చూసి... అలా పట్టించేలా:-
గతంలో నేరాలకు పాల్పడిన వారి ముఖాన్ని కంప్యూటర్లో పొందుపరుస్తారు. దానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి కెమేరాలతో అనుసంధానిస్తారు. అప్పటికే కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న ఫొటోల్లోని వ్యక్తులెవరైనా ఆ కెమేరా ముందుగా వెళ్తుంటే వెంటనే అప్రమత్తం చేసేలా ఆ సాఫ్ట్వేర్ పని చేస్తుంది. గతంలో శిక్ష అనుభవించిన వారు, బెయిల్పై బయట ఉన్న వారు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగే వారు ఈ కెమెరాల కంటపడితే వెంటనే అలర్ట్ మెసేజ్లు వస్తాయి. దాంతో ఆ కెమేరాలను ఆపరేట్ చేసేవారు... ఆ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకు వస్తారు. వారు అప్రమత్తమై ఆయా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. ఇలా పాత నేరస్తులు కొండపైకి చేరకుండా ఈ కెమేరాలను వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
ఎన్ని కెమేరాలు... ఎక్కడెక్కడా...
అలిపిరి చెక్పాయింట్, అలిపిరి కాలినడక, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారానే తిరుమలకు రావాలి. ఈ మూడు చోట్ల మొత్తం 24 ఫేస్ రికగ్నేషన్ కెమేరాలను ఏర్పాటు చేయాలని విజిలెన్సు అధికారులు భావిస్తున్నారు. ఈ కెమేరాల పరిశీలన, వాటి ద్వారా వచ్చే సందేశాలను విశ్లేషించేందుకు అలిపిరిలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరు కెమేరాల ద్వారా వచ్చే సందేశాలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తారు. ఒకవేళ పాతనేరస్థులను ఈ కెమేరాలు గుర్తిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు.
ఆటోమెటిక్ వెహికల్ ఐడింటిఫై కూడా...
ఫేస్ రికగ్నిషన్ కెమేరాల వ్యవస్థతో పాటు ‘ఆటోమెటిక్ వెహికల్ ఐడింటిఫై సిస్టమ్’ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజిలెన్స్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా అతివేగం, నిబంధనల అతిక్రమణ వంటి వాటికి పాల్పడిన వాహనాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం అలిపిరిలోని గరుడ సర్కిల్ వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ వద్దే ఆటోమెటిక్ వెహికల్ ఐడింటిఫై సిస్టమ్ ఉంది. కానీ కొంత మరమ్మతులకు గురవడంతో ప్రస్తుతం అవి పనిచేయటం లేదు. తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై నూతనంగా బాధ్యతులు స్వీకరించిన సీవీఎస్వో రవికృష్ణ, ఇతర విజిలెన్స్ అధికారులు పలుమార్లు సమావేశమై ఈవో అనిల్కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక కమాండెంట్ కంట్రోల్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతమున్న విధానం ద్వారా నేరాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోవటమే ఇందుకు కారణం. తిరుమలలో దాదాపు 640 సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ నేరాలు, నిబంధనల అతిక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ కెమేరాల పనితీరును పరిశీలించే కమాండెంట్ కంట్రోల్ రూమ్లో మార్పులు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.