09/02/2018
గల్లా జయదేవ్ గారి పూర్తి ప్రసంగం తెలుగులో
‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్... మీ సంకీర్ణ భాగస్వాములకు మీరు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? మీ చేతిలో మోసపోయామని, అవమానాలకు గురవుతున్నామని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. ఐదుకోట్ల మంది ఏపీ ప్రజలూ అదే భావిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీలో టీడీపీని బలహీనపర్చి, బీజేపీ బలపడవచ్చని మీ పార్టీ నేతలు మీకు తప్పుడు సలహా ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు సలహాలతో ఉమ్మడి ఏపీని విభజించి, 2014 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏపీ ప్రజలను మోసగించడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందాలని, వైసీపీతో రహస్య ఒప్పందం ద్వారా ఏపీలోనూ అధికారం చలాయించవచ్చని కాంగ్రెస్ భావించింది, కానీ... ఏపీ ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. కాంగ్రెస్ నూ పూర్తిగా తుడిచిపెట్టేశారు. వైసీపీ ఎత్తులనూ చిత్తు చేశారు. అలాంటి తప్పుడు వ్యూహాలను అనుసరిస్తే బీజేపీకి అంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడొద్దు’’ అని హెచ్చరించారు. వైసీపీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.
‘‘గడిచిన నాలుగేళ్లలో మా ముఖ్యమంత్రి 29సార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని, ఆర్థిక మంత్రిని, ఇతర కేబినెట్ మంత్రులను కలిశారు. సవిరమైన నివేదికలు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రధానిని కలిసి సమగ్ర నివేదిక అందజేశారు. ఇంత చేసినా ఇంకా సమాచారం కావాలని కోరడం.. పరిశీలిస్తున్నామనడం సిగ్గుచేటు’ అని గల్లా జయదేవ్ ఘాటుగా విమర్శించారు. ఏపీ విభజన చట్టంలో 19 అంశాలు ఉన్నాయని, వాటిలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ, జాతీయ విద్యాసంస్థలు, దుగరాజపట్నం ఓడరేవు. అసెంబ్లీ సీట్ల పెంపు వంటివి ఉన్నాయన్నారు.
‘‘సాంకేతిక సమస్యల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అంటే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నాం. రెండిటికీ తేడా లేకుండా నిధులు వచ్చేలా చూస్తామని ప్రధాని, ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. మనం కలిసి పోటీ చేసి గెలిచాం. అందుకే నాలుగు బడ్జెట్ల వరకు నమ్మకంతో వేచి చూశాం. ఇంక ఆ అవకాశం లేదు. ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్.. ఇక్కడే మీరు కేటాయింపులు చేయాల్సి ఉంది. మీకు లోక్సభలో సంఖ్యాబలం ఎక్కువుందని మాకు అర్థమవుతుంది. కానీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు గమనిస్తుంటారు’’ అని జయదేవ్ హెచ్చరించారు.
‘‘రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించిన కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు. మరి... ఆ చట్టంలోని అంశాలను కనీసం అమలు చేయని బీజేపీ సంగతి ఏమిటో ఆలోచించండి. వీటన్నింటిపై మీ వివరణ డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో... మీరు మా రాష్ట్రం పట్ల ‘దురుద్దేశం’ (బ్యాడ్ ఫెయిత్)తో ఉన్నారని భావించి... ఈ బంధం ఎందుకు కొనసాగించాలి? అనే అంశంపై ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని జయదేవ్ హెచ్చరించారు.
‘‘అమరావతిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, వంటి నిర్మాణాలకు ప్రాథమిక అంచనాల ప్రకారం ఇందుకు 1.20 లక్షల కోట్లు అవసరం. కానీ... గత మూడేళ్లలో 1500 కోట్లు ఇచ్చారు. ఇది సరికాదు. రాజధాని కోసం ఏటా కనీసం రూ.10వేల కోట్లు చొప్పున నాలుగైదేళ్లపాటు ఇవ్వాలి’’ అని జయదేవ్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న సంస్థలన్నీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కానీ... వాటికి అరకొరగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
‘‘ఇలాగేతై... అవి పూర్తి కావడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఉదాహరణకు... అమరావతిలో ఎయిమ్స్కు 10,680 కోట్లు కావాలి. ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు. ఈసారి... అనేక రాష్ట్రాల్లోని ఎయిమ్స్కు నిధులు కేటాయించారు. ఏపీకి మాత్రం ఇవ్వలేదు. బహుశా... మా రాష్ట్రంలో ఎన్నికలు లేవనే కావొచ్చు. ఏపీకి... ఆయా సంస్థలకు 1814 కోట్లు కేటాయించారు. ఇది... తెలుగు సినిమా ‘బాహుబలి’ కలెక్షన్లకంటే తక్కువే అనడం అతిశయోక్తి కాదు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఏపీకి రైల్వేజోన్ ఇవ్వలేదు. కానీ... బెంగళూరుకు 17వేల కోట్లు, ముంబైకి 51కోట్లు ఇచ్చారు. కానీ... వైజాగ్, విజయవాడ మెట్రో గురించిన ప్రస్తావన లేదు. ఏం... కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి! ఏపీలో లేవు! అందుకేనా? దీనిని ఎలా సమర్థించుకుంటారు? రైల్వే జోన్ విషయానికి వస్తే... పొరుగు రాష్ట్రాలతో సంప్రదించాలని రైల్వే మంత్రి రాజ్యసభలో ప్రకటించారు. నాలుగేళ్లతర్వాత ఇవేం మాటలు? ఇవి సీనియర్ నాయకుడైన మంత్రి పియూష్ గోయల్ నుంచి రావాల్సిన మాటలు కావు! ఇవన్నీ... జోన్ ఇవ్వకుండా జాప్యం చేసేందుకు వేసే ఎత్తులని ఏపీ ప్రజలు భావిస్తున్నారు’’ అని తేల్చి చెప్పారు.
‘‘ఈ సభా వేదిక పై నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను! 2016 సెప్టెంబరు 16న ప్రకటించిన ప్యాకేజీని ఎప్పటిలోపు అమలు చేస్తారో చెప్పండి! నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించండి. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాలకు కోరాపుట్, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. కానీ... 6వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈసారి... అది కూడా ఇవ్వలేదు. ఈ ప్యాకేజీని ఇచ్చి తీరాలి’’ అని జయదేవ్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సవరించిన అంచనాలు ఇచ్చిందని, వాటిని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
‘‘ఇప్పటిదాకా మీరు సంకీర్ణ ధర్మం పాటించలేదు. ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా పాటించండి. ఇలా చెప్పాలని గానీ, మిత్రపక్షం మనసు గాయపరిచేలా మాట్లాడాలనిగానీ మాకు లేదు. కానీ... మీరు మాకు అలాంటి పరిస్థితి కల్పించారు. ఇది కీలకమైన ఎన్నికల సంవత్సరం. కూటమిలోని మిత్రులకు, కొత్తగా మిత్రులు కావాలనుకునే వారికీ విషయం అర్థమవుతుంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి దీనికి సమగ్ర వివరణ ఇవ్వాల్సిందే.
చివరిగా, ‘‘కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు’’.ఏపీ ప్రజలు మూర్ఖులు కాదు!’ అని జయదేవ్ తన ప్రసంగాన్ని ముగించారు
2017 © COPYRIGHT NAVYANDHRATIMES ALL RIGHTS RESERVED .